ప్రభుత్వ ఉద్యోగం చాలామందికి కల. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే, కొంత మంది మాత్రం సులువుగా ఉద్యోగం సాధించాలని పక్కదారి తొక్కుతుంటారు. ఈ క్రమంలోనే నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సంపాదిస్తారు. అయితే, ఉద్యోగంలో చేరిన మొదట్లో వారు పట్టుబడలేదంటే ఇంకా వారిని పట్టుకునే వారుండరు. కానీ, ఇక్కడ ఓ అధికారి నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సాధించి.. కస్టమ్స్ విభాగంలో దాదాపు 30 ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పని చేశాడు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి ఎదిగాడు. ఇంతకి ఎవరా అధికారి.. 30 ఏళ్ల తర్వాత ఎలా పట్టుబడ్డాడు తెలుసుకోండి.
హైదరాబాద్లోని జీఎస్టీ అండ్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న సంజయ్ శాంతారాం పాటిల్ బండారం ఎట్టకేలకు బయటపడింది. అతడు 1990 డిసెంబర్ 21న ముంబయి కస్టమ్స్ విభాగంలో కస్టమ్స్ ప్రివెన్షన్ అధికారిగా ఉద్యోగంలో చేరాడు. అప్పటి నుంచి వివిధ హోదాల్లో ఆయన విధులు నిర్వర్తించారు. అయితే, అతడి విద్యా అర్హత ధృవ పత్రాలపై అనుమానం వచ్చిన సంజయ్ జాదవ్ అనే వ్యక్తి.. 2015 జులై 17న సంజయ్ పాటిల్ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని ముంబయిలోని అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్(కస్టమ్స్) కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
అయితే, దీనిపై విచారణ జరుగుతుండగానే 2017లో సంజయ్పాటిల్కు అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతి ఇచ్చి, హైదరాబాద్కు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా పాటిల్ సమర్పించిన పత్రాలను కస్టమ్స్ విజిలెన్స్ విభాగం అధికారులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకా ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. రాంచీ విశ్వవిద్యాలయం జారీ చేసినట్లు చెబుతున్న డిగ్రీ విద్యార్హత పత్రంతోపాటు ప్రొవిజనల్, మైగ్రేషన్ ధృవపత్రాలు, మార్కుల జాబితా, చివరకు హాల్టిక్కెట్ కూడా నకిలీవేనని తేలడంతో అధికారులు అవాక్కయ్యారు.
దీంతో 2019 ఏప్రిల్ 26న ఉన్నతాధికారులు సంజయ్పాటిల్ను సస్పెండ్ చేశారు. అతడిపై తదుపరి చర్యల కోసం హైదరాబాద్ జీఎస్టీ అండ్ కస్టమ్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయానికి చెందిన అదనపు కమిషనర్ కె.జి.వి.ఎన్.సూర్యతేజ 2021 నవంబరు 12న హైదరాబాద్ సీబీఐ విభాగానికి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలోనూ పాటిల్ ధృవపత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో బుధవారం కేసు నమోదు చేశారు.