వరంగల్ లో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్ పోలీస్ కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు అతన్ని వరంగల్ జిల్లా కోర్టులో హాజరు పర్చారు.
ఇప్పటికే నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీలో సైఫ్ ను విచారించిన పోలీసులు..మరో రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడిగించాలని కోర్టును కోరారు. పోలీసుల నిర్ణయాన్ని జడ్జి నిరాకరించడంతో విచారణ రేపటికి వాయిదా వేశారు.
అనంతరం పోలీసులు సైఫ్ ను ఖమ్మం జైలుకు తీసుకెళ్లారు.అంతకు ముందు ప్రీతిది హత్యేనని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో సైఫ్ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ.. కోర్టు అనుమతించింది. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా… నాలుగు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
మరోవైపు.. ప్రీతిది ఆత్మహత్య కాదు, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ మరోసారి ఆరోపించారు. తమకు ఎలాంటి టాక్సికాలజీ రిపోర్ట్ రాలేదని వెల్లడించారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి కోరడానికి వచ్చామని నరేందర్ తెలిపారు. నిందితులకు సరైన శిక్ష పడేలా చూడాలని కోరుతున్నామన్న ఆయన.. ఇటీవల మట్టేవాడా పోలీసులు తమ ఇంటికి వచ్చి.. ఘటనపై మరోసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారని చెప్పారు.
టాక్సికాలజీ కోసం ఫ్రెష్ గా ఎక్కించిన రక్తం నమూనాలు తీసుకున్నారు కాబట్టి సరైన రిపోర్ట్ రాదని డాక్టర్లు చెప్పారన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఘటన జరిగిన రోజే నమూనాలు తీసుకొని ఉంటే టాక్సీకాలజీ రిజల్ట్ కరెక్ట్ వచ్చేదని నరేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.