ఏపీ నూతన గవర్నర్ గా జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ రాజ్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..జస్టిస్ అబ్దుల్ నజీర్ తో ప్రమాణం చేయించారు.
గవర్నర్ ప్రమాణస్వీకారోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సీఎం జగన్, చీఫ్ జస్టిస్ మిశ్రా.. గవర్నర్ నజీర్ కు పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జస్టిస్ నజీర్ కర్ణాటకలోని బెలువాయి గ్రామానికి చెందినవారు. 1958 జనవరి 5న జన్మించారు. బాల్యం అంతా మూడబిదరిలోనే గడిచింది. స్థానిక మహాబీర్ కళాశాలలో బీకాం చదివిన ఆయన ఆ తరువాత మంగళూరు కొడియాల్ బెయిల్ ఎస్డీఎం లా కాలేజీలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.
2003 లో మొదటి సారిగా కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ మరుసటి ఏడాది హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 లో సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులైన ఆయన ఈ ఏడాది జనవరి 4 వరకూ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు.