తెలంగాణ సచివాలయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో, మూఢ నమ్మకాలతో సెక్రటేరియట్ ను కూల్చేశాడని ఆరోపించారు. దీనిపై సీబీఐ వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
అగ్ని ప్రమాదం వెనక ఏదో మర్మం దాగుందని.. వెంటనే సెక్రటేరియట్ ను క్రైమ్ జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కూల్చివేతపై హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్న ఆయన.. సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని చెప్పారు.
తన ఫోన్ ట్యాప్ చేసి.. సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయని ప్రశ్నించారు.
ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునే సచివాలయాన్ని ఎందుకు ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని అన్ని వర్గాల ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు కేఏ పాల్.