ప్రజా శాంతి పార్టీ కేఏ పాల్ను మంగళవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తనపై సిద్దిపేట జిల్లాలో సోమవారం జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు డీసీపీ కార్యాలయానికి వెళ్లాలని పాల్ భావించారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. తనను కొట్టిన వ్యక్తి మంత్రి కేటీఆర్ మనిషేనని కేఏ పాల్ ఆరోపించారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దాడిని వివరించారు కేఏ పాల్.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్తుండగా.. ఉన్నట్టుండి 20 మంది పోలీసులు వచ్చి తనను ఆపారని చెప్పారు. ఆ తర్వాత వెంటనే డీఎస్పీ, సీఐ అక్కడికి వచ్చారన్నారు. తనను కొట్టిన వ్యక్తితో పోలీసులు బ్లూ టూత్లో మాట్లాడారని కేఏ పాల్ ఆరోపించారు.
కేఏ పాల్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. కేఏ పాల్ పోలీసులతో మాట్లాడుతుండగానే అక్కడే ఉన్న ఓ టీఆర్ఎస్ నేత కేఏ పాల్ చెంప పగలగొట్టారు. కేఏ పాల్ చెంపపై కొట్టడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అక్కడున్న వారు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారకుండా.. ఇరువర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కేఏ పాల్ను తన వాహనంలో ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు.