ఖబడ్దార్ కేటీఆర్.. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో అర్థమవుతోందా..? అంటూ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎంతో మంది దేశ అధ్యక్షులు మోకరిల్లిన తన మీద సీఎం కేసీఆర్ దాడి చేయించాడని ఆరోపించారు. డీజీపీని కలుద్దామంటే కలవనివ్వట్లేదని మండిపడ్డారు. తనను రెండు రోజులుగా బయటకు రానివ్వకుండా గృహనిర్భందం చేశారని విరుచుకుపడ్డారు.
తనపై జరిగిన దాడి విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాకు ఫిర్యాదు చేశానని.. ఇక డీజీపీని కలవనని స్పష్టం చేశారు పాల్. ఇప్పుడే..రాష్ట్రంలో ఇంతగా గుండా రాజ్యం ఉందంటే.. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఇంకేంత అరాచకం రాజ్యమేలుతుందో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా.. తండ్రీ కొడుకులిద్దరూ చిత్తుచిత్తుగా ఓడిపోవటం ఖాయమని ద్వజమెత్తారు. అభివృద్ధి కావాలంటే కేఏ పాల్.. అరాచక పాలన కావాలంటే కేటీఆర్.. ఇక ప్రజలే ఆలోచించుకోవాలన్నారు పాల్.
తెలంగాణలో టీఆర్ఎస్ గుండాల రాజ్యం నడుస్తోందని విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు వారిపై ఫిర్యాదు చేయడానికి ఎవరూ సాహసించలేదని.. కానీ ఇప్పుడు కేఏ పాల్ వచ్చాడని.. మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి హెచ్చరించారు. సిరిసిల్లలో తన మీద జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి డీజీపీ కార్యాలయానికి వెళ్దామనుకుంటే రెండు రోజులుగా పోలీసులు తనను గృహ నిర్భందం చేశారని ఆరోపించారు.
Advertisements
రాబోయే రోజుల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాబోతుందని.. ప్రజలకు కావాల్సిన అన్ని అభివృద్ది పనులు తన వల్లనే సాధ్యమవుతాయన్నారు పాల్. టీఆర్ఎస్ కీచక పాలన కావాలా..? ప్రజాశాంతి పార్టీ అభివృద్ది కావాలా..? తేల్చుకుని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు పాల్.