కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ నిర్మాణంపై 12 గ్రామాల నిర్వాసితులు భూసేకరణ ప్రక్రియను వ్యతిరేకించడంతో.. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు భూములు కోల్పోయిన రైతులు.. మరోసారి భూములు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు.
అయితే.. ఒకవైపు కొన్ని గ్రామాల్లో నిర్వాసితులు భూసేకరణను వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూముల్లో తవ్వకాలు ప్రారంభించారు అధికారులు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లి జంక్షన్ గేటు వద్ద మంగళవారం తవ్వకం పనులు చేపట్టారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఏకకాలంలో 3 టీఎంసీలు తరలించేందుకు చేపడుతున్న కాల్వ భూసేకరణపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఎస్సారెస్పీ వరద కాలువ, గాయత్రి పంప్ హౌస్ కోసం గతంలో సేకరించిన భూముల్లో జేసీబీలతో కాలువ పనులు మొదలు పెట్టారు.
గతంలో గ్రామాల్లో అధికారులు భూసర్వేకు యత్నించగా పలుసార్లు అడ్డుకున్నారు గ్రామస్తులు. మరోవైపు రామడుగు, గంగాధర, బోయిన్పల్లి మండలాల్లో చేపట్టిన భూసర్వే ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం జలాల కారణంగా తమ భూముల్లో సిరులు పండించే పరిస్థితి నెలకొందని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి భూమి ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు.