తన మీద, మంత్రుల మీద, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై మీద ఈడీ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లల్లో.. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ అధికారంలో వచ్చిందని విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ తన పేరును ప్రస్తావించడంపై కవిత స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రానికైనా మోడీ పోయే ముందు.. ఈడీ రావడం చూస్తూనే ఉన్నామని అన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి కనుకే.. మోడీ కన్నా ముందు ఈడీ వచ్చిందని విమర్శించారు. ఇది కామనే అని అన్నారు. ఇలాంటి వాటిని పట్టించుకునే అవసరం లేదని అన్నారు.
దర్యాప్తు సంస్థలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతున్నామని కవిత తెలిపారు. మీడియాలో లీక్లు ఇచ్చి నాయకులకు ఉన్న మంచి పేరు చెడగొడున్నారని విమర్శించారు ఇలాంటి వాటిని ప్రజలు తిప్పికొడతారని అన్నారు. ఈ పంథా మార్చుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలని అనుకుంటే చైతన్యవంతమైన తెలంగాణలో అది కుదరని పని అన్నారు.
కేసులు పెడతాం, జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. భయపడేది లేదని అన్నారు. జైలులో పెడితే ఏమైతది అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని అన్నారు. ఇక, మీడియాతో మాట్లాడిన అనంతరం కవిత జగిత్యాల జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా అరెస్ట్ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమర్పించిన రిమాండ్ రిపోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా పలువురి పేర్లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ క్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు బుధవారం ఉదయం అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ పేర్లు కూడా ఉన్నాయి.
కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా, ఐఎంఈఐ ఆధారంగా డేటాను విశ్లేషించినట్టుగా తెలిపింది.