శరన్నవరాత్రుల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం (ఆశ్వయుజ శుద్ధ తదియ) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీదేవిగా సాక్షాత్కరిస్తుంది. వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ తల్లి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే సకల ఉపద్రవాలూ తొలగుతాయనీ, బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున వంగ, ఆకుపచ్చ, బంగారు వన్నెల చీరల్లో కొలుదీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహోర, కేసరి, పులగాలను సమర్పిస్తారు.
పిల్లవాడికి ఎప్పుడు ఏది అవసరమో తెలుసుకొని దాన్ని తీరుస్తుంది తల్లి. అమ్మవారు కూడా అంతే! మనకి ఆహారం కావల్సినప్పుడు అన్నపూర్ణగా మారుతుంది. చదువు కావల్సినప్పుడు సరస్వతి అవుతుంది. ఆ అమ్మవారు మనల్ని ఆదుకునే తీరుని బట్టి ఆమెను వేర్వేరు రూపాలలో పూజించుకునే సందర్భమే దసరా! అలా దసరా సందర్భంగా పూజించే రూపాలలో గాయత్రీదేవి అలంకారం కూడా ఉంది.
వేదాల నుంచి పురాణాల వరకూ గాయత్రి దేవిని జ్ఞానానికి ప్రతరూపంగా చెబుతూ వచ్చారు. గాయత్రి అమ్మవారిని తల్చుకున్నా, ఆమె మంత్రాన్ని జపించినా కూడా బుద్ధి వికసిస్తుందని పెద్దల నమ్మకం. గాయత్రి మంత్రంలో కనిపించించే ‘ధియోయోనః ప్రచోదయాత్”కి అర్థమిదే. ఇంతకీ దసరా సందర్భంగా ఈ గాయత్రీ అమ్మవారిని ఎలా పూజించుకోవాలో చెప్పనే లేదు కదూ!
హిందువులు తామరపూలని జ్ఞానానికి చిహ్నంగా భావిస్తుంటారు. అందుకే ఆ జ్ఞానాన్ని అందించే గాయత్రీ అమ్మవారికి కూడా తామర పూలంటే చాలా ఇష్టమట. దసరా సందర్భంగా గాయత్రీదేవిని పూజించేటప్పుడు ఒక్క తామరపూవైనా సమర్పిస్తే అమ్మవారు సంతోషిస్తారు. ఇక అమ్మవారిని ఆ రోజు నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఉదయపు సూర్యకిరణాలు నారిజం రంగులో ఉంటాయి. సూర్యుడి వెలుగులాగా గాయత్రీదేవి కూడా జ్ఞానాన్ని ప్రసరిస్తుంది కాబట్టి నారింజ రంగు బట్టలతో అమ్మవారిని అలంకరించమని పెద్దలు చెబుతారు.
ఈరోజు అమ్మవారిని గాయత్రి అష్టోత్తరంతో పూజిస్తే మంచిది. అలా కుదరని పక్షంలో “ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్య ధీమహి ధీయో యోనః ప్రచోదయాత్!” అనే మంత్రంతో ఆరాధించాలి. అదీ వీలుకాని పక్షంలో ‘ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః’ అన్న మంత్రంతో పూజించాలి. పూజ తర్వాత అమ్మవారికి కొబ్బరి అన్నం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. కుదరకపోతే రవ్వ కేసరి, అది కూడా కాకపోతే ఉత్త పంచదార పెట్టినా కూడా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. దసరా సందర్భంగా అమ్మవారిని వేర్వేరు రూపాలలో పూజించేటప్పుడు వేర్వేరు వస్తువులు తినకూడదని చెబుతారు. అలా గాయత్రీదేవిని పూజించే రోజున వంకాయలతో వండిన పదార్థాలు తినకూడదట.