సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి. గతేడాదికి సంబంధించిన అవార్డులను సోమవారం రాత్రి ముంబైలో నటులకు అందజేశారు. అయితే ఈ అవార్డుల విషయంలో కొందరు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వారిలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా ఒకరు. అవార్డుల కేటాయింపులో నిర్వాహకులు పక్షపాతంతో వ్యవహరించారని ఆమె మండిపడ్డారు.
కేవలం బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే అవార్డులు వస్తున్నాయంటూ పరోక్ష విమర్శలు చేశారు. నెపోటిజం వల్లే అలియా భట్, రణబీర్ కపూర్ కు అవార్డులు దక్కాయని విమర్శించారు. అవార్డులు పొందే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితాను ట్విట్టర్ లో ఆమె పంచుకున్నారు. బాలీవుడ్ ను నెపోటిజం వదలడంలేదని కంగన ఫైర్ అయ్యారు.
ముంబైలో సోమవారం రాత్రి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల కార్యక్రమం జరిగింది. ఇందులో గంగూబాయి కథియావాడి సినిమాకు గానూ ఉత్తమ నటి కేటగిరీలో అలియా భట్ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా అలియా భట్ భర్త రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి రణబీర్ కపూర్ హాజరుకాకపోవడంతో భర్త తరఫున అలియా భట్ ఈ అవార్డును కూడా తీసుకున్నారు.
ఈ కార్యక్రమంపై కంగనా రనౌత్ ట్విట్టర్ లో స్పందించారు. బాలీవుడ్ లో నెపో మాఫియా కారణంగా మిగతా వారికి అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు. అర్హులకు అవార్డులు, అవకాశాలు అందట్లేదని మండిపడ్డారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకునే అర్హత వీరికే ఉందంటూ ఓ జాబితా విడుదల చేశారు.
బెస్ట్ యాక్టర్ అవార్డు రిషబ్ శెట్టి (కాంతారా), బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు మృణాల్ థాకూర్ (సీతారామం), ఉత్తమ చిత్రం అవార్డు కాంతారా, ఉత్తమ దర్శకుడు అవార్డు ఎస్ఎస్ రాజమౌళి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ సహాయ నటుడు అనుపమ్ ఖేర్ (కశ్మీరీ ఫైల్స్), ఉత్తమ సహాయ నటి టబు (భూల్ భులయ్యా) మొదలగు వారిని కంగనా తన జాబితాలో పేర్కొన్నారు.