సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై దేశ వ్యాప్తంగా ఆర్మీ అభ్యర్ధులు ఆందోళనలు చెప్పారు. ఇప్పటికే పలు చోట్ల రైళ్లకు నిప్పంటించారు. అయితే.. ఈ ఆందోళనలపై ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ స్కీంకు కంగనా మద్దతు ప్రకటించారు.
ఇలాంటి ఒక పథకానికి శ్రీకారం చుట్టినందుకు కేంద్రాన్ని అభినందిస్తున్నట్లు ఆమె తన ఇన్స్టాగ్రాం స్టేటస్ లో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ లాంటి చాలా దేశాల్లో అక్కడి యువతకు సైన్యంలో శిక్షణను ఆయా దేశాలు తప్పనిసరి చేశాయని కంగనా వెల్లడించారు. కొన్నేళ్లు ప్రతీ ఒక్కరూ ఆర్మీలో పనిచేయడం ద్వారా జీవితంలో ఎలా విలువలతో జీవించాలో తెలుసుకుంటారని వివరించారు.
క్రమశిక్షణ, జాతీయత భావం.. దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించడం ఎలాగో తెలుసుకుంటారని ఆమె చెప్పారు. డ్రగ్స్, పబ్జీ లాంటి వాటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత శాతం షాక్ కు గురిచేస్తోందని పేర్కొన్నారు కంగనా. ఇలాంటి సంస్కరణలు కచ్చితంగా అవసరమేనని కంగనా స్పష్టం చేశారు.
స్కీంలో కూడా ఎంతో లోతైన అర్థం ఉందన్నారు కంగనా. ఈ స్కీం ఏదో డబ్బు సంపాదనకో, భవిష్యత్ ను నిర్మించుకోవడానికో, ఉపాధి కల్పనకో కాదని ఆమె స్పష్టం చేశారు. అప్పటి రోజుల్లో ప్రతీ ఒక్కరూ గురుకులానికి వెళ్లేవారని.. ఈ ‘అగ్నిపథ్’ కూడా అలాంటిదేనని ఆమె పేర్కొన్నారు.