సేమ్ తెలంగాణలో ఉన్న పొలిటికల్ సీనే ఏపీలో కూడా రిఫ్లెక్ట్ అవుతున్నట్టుంది. ఇక్కడ కూడా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల పదును పెంచింది. జగన్ సర్కార్ అన్ని రంగాల్లో ఘోరంగా వైఫల్యం చెందారని బీజేపీ రాష్ట్ర సారధి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చాలా త్వరగా పరిపాలనపై జగన్ పట్టు కోల్పోయారని కన్నా విమర్శించారు.
గుంటూరు: ఏపీ సీఎం జగన్ గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జగన్వి అన్నీ ప్రభుత్వంపై భారం పడే నిర్ణయాలేనని విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరు మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొస్తున్నారని కన్నా విమర్శించారు. పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థ అదని ఆరోపించారు. అది కేవలం పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని కన్నా అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు మూలన పడే పరిస్థితి రావడానికి కారణం.. మీ నిర్ణయాలు కాదా? అని కన్నా వైసీపీ సర్కారుని నిలదీశారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారిచ్చారని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని కన్నా విమర్శించారు. వ్యక్తులు మారడం తప్ప వ్యవస్థ ఏమీ మారలేదన్నారు. అవినీతిపరులను వదిలేసి రేషన్ డీలర్లు, తాత్కాలిక ఉద్యోగులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని కన్నా మండిపడ్డారు. కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువమందిని రోడ్డున పడేశారన్నారు. రోజురోజుకు అభివృద్ధి క్షీణించే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ‘ఈ మూడు నెలల్లో మీ అవగాహనా రాహిత్యం ప్రతి నిర్ణయంలోనూ కనిపిస్తోంది. మత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి’ అని కన్నా విమర్శించారు.
ఇసుక మాఫియాను అరికడతామని చెప్పి.. కొత్త పాలసీ పేరుతో ఇసుక దొరక్కుండా చేశారని బీజేపీ నేత ఆరోపించారు. కార్మికులు, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా.. వరదలు వస్తే జగన్ అమెరికాలో కూర్చున్నారని కన్నాఎద్దేవా చేశారు. ప్రజలు మంచి మార్పు కోరుకొని జగన్కు అవకాశం ఇచ్చారని కానీ ఆయన గత ఐదేళ్ల సంగతే మాట్లాడుతున్నారు కానీ.. ప్రస్తుతం ఏంటనేది చెప్పలేదన్నారు. సహకార రంగంలో ఎన్నికలు జరిపే ధైర్యం కూడా లేకపోయిందని అన్నారు.