‘కాంతార’ మూవీ ఫేమ్ యాక్టర్ కిశోర్ కుమార్ ట్విట్టర్ అకౌంట్ పై వేటు పడింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో విభిన్న పాత్రలు చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు యాక్టర్ కిశోర్ కుమార్. తాజాగా ఆయన ట్విట్టర్ అకౌంట్ పై వేటు పడింది. ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించినందున కిశోర్ అకౌంట్ ను ట్విట్టర్ సంస్థ నిలిపివేసింది.
ఈ విషయం ఆయన ట్విట్టర్ పేజ్ లో కనిపిస్తుంది. అయితే దీనిని ఎప్పుడు నిలిపివేశారో, ఏ ట్వీట్ వల్ల వేటు పడాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. అయితే ఆయన ట్విట్టర్ అకౌంట్ ను తిరిగి పునరుద్ధరించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కు నేరుగా అభ్యర్థన చేస్తున్నారు.
కాగా కాంతార మూవీలో కిశోర్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అటవీ శాఖ అధికారిగా ఫ్యాన్స్ ని అలరించారు. అలాగే ఫ్యామిలీ మ్యాన్, షీ వెబ్ సిరీస్ లలోనూ నటించారు.
కిశోర్ ఏ విషయంపైనైనా తన అభిప్రాయాలను సూటిగా వెల్లడిస్తారు. రైతులకు సంబంధించిన అంశాలపై తన గళాన్ని వినిపిస్తూంటారు. అలాగే మీడియా సంస్థ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ దక్కించుకోవడాన్ని ఇన్ స్టా వేదికగా వ్యతిరేకించారు కిశోర్ కుమార్.