లంకతో జరిగిన మూడో టీ20లో సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్. ప్రస్తుతం అతనిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. సూర్య కుమార్ ఆటకు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా సూర్య కుమార్ ఆట తీరును భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మెచ్చుకున్నారు. అతని ఆటకు ముగ్ధుడిని అయ్యానని తెలిపారు. సూర్యకుమార్ లాంటి ఆటగాడు శతబ్దానికి ఒక్కసారే వస్తారని కొనియాడారు. అతను కొట్టిన షాట్లను ఎలా వర్ణించాలో అర్థం కావడం లేదన్నారు కపిల్ దేవ్.
సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని చూసినప్పుడు వీరిని ఎవరితో అయినా పోల్చవచ్చు. నిజానికి భారతదేశంలో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. కానీ నేను మాత్రం సూర్యకుమార్ లాంటి ఆటగాడిని చూడలేదన్నారు. అతని ఆడే క్రికెటే వేరని కొనియాడారు. అతపే ల్యాప్ లో కొట్టే ఫైన్ లెగ్ షాట్ బౌలర్ ను భయపెడుతుందన్నారు. ఎందుకంటే అతను నిలబడి మిడ్-ఆన్, మిడ్-వికెట్ మీదుగా సిక్సర్ కొట్టగలడు. బౌలర్ లైన్ అండ్ లెంగ్త్ ను నిలకడగా ఎంచుకోగలడు.
అందుకే బౌలర్లు అతనికి బౌలింగ్ చేసేందుకు భయపడుతుంటారు. డివిలియర్స్, వివియన్ రిచర్డ్స్, సచిన్, విరాట్, రికీ పాంటింగ్ వంటి గొప్ప బ్యాటర్లను నేను చూశాను. అయితే క్రికెట్ లో చాలా కొద్దిమంది మాత్రమే క్లీన్ గా బంతిని కొట్టగలరు. ఈ విషయంలో సూర్యకుమార్ యాదవ్ బెస్ట్.. అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి ఆటగాళ్లు సెంచరీకి ఒక్కసారి మాత్రమే వస్తారు అని పేర్కొన్నారు.
క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లుగా పేరొందడం మామూలు విషయం కాదు. వివ్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి బ్యాట్స్ మెన్స్ గొప్ప ఆటగాళ్లుగా ఎదగడానికి వారి రికార్డులు మాత్రమే కారణం కాదని.. వారి ఆటతీరు కూడా అందుకు కారణమని చెప్పుకొచ్చాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా వీరి సరసన చేరుతాడని ప్రశంసించాడు కపిల్ దేవ్.