ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా.. ఇదేంటని ప్రశ్నించినందుకు పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది ఓ ఎమ్మెల్యే కూతురు. అంతటితో ఆగకుండా ఈ తతంగాన్ని మీడియా ద్వారా రికార్డు చేస్తున్న కెమెరామెన్, జర్నలిస్ట్ లతో అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా.. ఓ జర్నలిస్ట్ పై చేయిచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో గురువారం వెలుగుచూసింది.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ నింబావళి కూతురు బీఎండబ్ల్యూ కారు నడుపుతూ.. సిగ్నల్ జంప్ చేసింది. రెడ్ సిగ్నల్ పడినా.. ఆమె కారు ఆపలేదు. అతివేగంగా వాహనం నడపటంతో ట్రాఫిక్ పోలీసులు ఆమెకు జరిమానా విధించారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అయితే.. ఈ ఘటనపై స్పందించిన సదరు ప్రజాప్రతినిధి.. తన కుమార్తె చర్యలను సమర్ధించారు. బెంగళూరులో రోజూ ఇలాంటి ఘటనలు వేలాదిగా జరుగుతుంటాయని వ్యాఖ్యానించారు. తన కుమార్తె చేసిన దాంట్లో తప్పేం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నా కుమార్తెనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే.
జర్నలిస్ట్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు వస్తున్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడం.. వీడియో వైరల్ కావడంతో చివరకు తన కుమార్తె చేసిన పనికి.. ఆ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు.