ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అలవైకుంఠపురములో’ చిత్రం హిందీ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. షెహజాదాగా ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించారు.ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన, క్రిటిక్స్ రెస్పాన్స్ బయటకు వచ్చేసింది. ఎక్కువగా షెహజాదా చిత్రానికి నెగిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం హిందీ ఆడియన్స్ లో వర్కౌట్ కాకపోవడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది కార్తీక్ ఆర్యన్ భూల్ భులాయ, ఫ్రెడ్డీ లాంటి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా భూల్ భులాయ చిత్రం కార్తీక్ కి సరికొత్త ఇమేజ్ తీసుకువచ్చింది. అతడి కెరీర్ భూల్ భులాయకి ముందు ఆ తర్వాత గా మారిపోయింది. ఫ్రెడ్డీ కూడా థ్రిల్లర్ చిత్రంగా ఆకట్టుకుంది. ఇలాంటి తరుణంలో కార్తీక్ ఆర్యన్ అల వైకుంఠపురములో చిత్రాన్ని రీమేక్ చేయాలనే నిర్ణయం తీసుకోవడం పొరపాటుగా మారింది. ఇటీవల రీమేక్ చిత్రాలేవీ వర్కౌట్ కావడం లేదు.
అల వైకుంఠపురములో చిత్రానికి రిలీజ్ కి ముందే మామూలు హైప్ క్రియేట్ కాలేదు. ఒక ఫ్యామిలీ చిత్రానికి ఇంత హైప్ ఎప్పుడూ సాధ్యం కాదు. కానీ తమన్ సంగీతం మ్యాజిక్ చేసింది. సామజవరాగమన మొదలుకుని, రాములో రాములా, బుట్ట బొమ్మ, ఓ మై గాడ్ డాడీ, సిత్తరాల సీరపడు ఇలా ప్రతి సాంగ్ యూట్యూబ్ లో దుమ్ములేపాడు. ప్రతి సాంగ్ వందల మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అందుకే రిలీజ్ కి ముందే అలవైకుంఠపురములో చిత్రానికి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. కానీ షెహజాదా చిత్రానికి చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఎంత హడావిడి చేసిన ఆడియన్స్ పట్టించుకోలేదు. కారణం ఈ చిత్రంలో ఒక్క సాంగ్ కూడా వర్కౌట్ కాలేదు.
షెహజాదా చిత్రంలో కృతి సనన్ కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అయింది అనే టాక్ వస్తోంది. ఆమె పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. అల వైకుంఠపురములో కూడా పూజా హెగ్డేకి గొప్పగా ఏమీ ఇంపార్టెన్స్ ఉండదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఆమె కాళ్ళని హైలైట్ చేస్తూనే.. మంచి మంచి డైలాగులు చెప్పిస్తూనే సినిమా మొత్తం ఆమె రోల్ ట్రావెల్ అయ్యేలా చేయగలిగారు. కానీ షెహజాదాలో అది జరగలేదు.
సినిమా మ్యాజిక్ వర్కౌట్ కావాలి అంటే దర్శకుడి పనితనంపైనే ఆధారపడి ఉంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మాంత్రికుడు. ఒక సింపుల్ కథని తీసుకుని చిన్న చిన్న అంశాలతోనే భలే కనెక్ట్ చేయగలిగారు. ఆలా వైకుంఠపురములో చిత్రంలోని కొన్ని సీన్స్ లో రెండు మూడు డైలాగులే ఉంటాయి.. కానీ ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. అది త్రివిక్రమ్ ప్రత్యేకత. కానీ హిందీలో త్రివిక్రమ్ స్థాయి పనితనాన్ని రోహిత్ ధావన్ చూపించలేకపోయారు.
చివరగా షెహజాదా చిత్రం ఫెయిల్ కావడానికి కారణం షారుఖ్ కూడా. పఠాన్ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. షారుఖ్ ఫ్యాన్స్ ఆ హ్యాంగోవర్ లోనే ఉన్నారు. ఆల్రెడీ పఠాన్ వల్ల షెహజాదా ఒకసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతున్న టైంలో పఠాన్ టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులని తమ వైపు తిప్పుకున్నారు. ఫలితంగా షెహజాదా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఈ కారణాల వల్ల అల వైకుంఠపురములో హిందీ రీమేక్ ఫెయిల్యూర్ అటెంప్ట్ గా మిగిలిపోయింది.