టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే ముందు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడాన్ని మానేస్తే బాగుంటుందంటూ మండిపడ్డారు కాసాని జ్ఞానేశ్వర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొడ్డు వడ్లు తినే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాలన మొదలైందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టారని చెప్పారు. బియ్యం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతానికి ఎవరి పాలనలో అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. తాము ప్రజలకు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటే.. కొందరికి ఎందుకు బాధ? అని ఆయన నిలదీశారు. నిరంజన్ రెడ్డి ఏరియా నుంచి వలసలు ఆగాయా? అని ప్రశ్నించారు. వలసలు ఇంకా పోతున్నారని ఎద్దేవా చెప్పారు.
చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోంది?, టీడీపీ ఇంటింటికీ వెళ్తుందని అనగానే గడీల రాజ్యం పునాదులు కదులుతున్నాయని, వణుకు పుడుతోందని కాసాని చురకలు అంటించారు. టీడీపీకి పూర్వవైభవం వస్తే.. తమ నాయకులకు పుట్ట గతులు ఉండవని బీఆర్ఎస్ భావిస్తోందని సెటైర్లు వేశారు.
ఎన్టీఆర్ పాలనకు ముందు దొరలకు కూడా తినేందుకు సన్న బియ్యం దొరకలేదని, ఆహార భద్రత అనేది టీడీపీ వచ్చిన తరువాతే లభించిందనేది వాస్తవమని తేల్చి చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని, దానిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమన్నారు. నిరంజన్ రెడ్డితో సూటిగా డిబేట్ కు సిద్ధమని స్పష్టం చేశారు కాసాని జ్ఞానేశ్వర్.