ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,పలువురు కీలక నేతలు యాదాద్రీశ్వరుడిని దర్శించుకున్నారు. కేసీఆర్,కేజ్రీవాల్,భగవంత్ మాన్ సింగ్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా ఇతర నేతలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు..నేతలకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అంతకుముందు ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన విందులో అతిథులు పాల్గొన్నారు.
ఇక దేశం దృష్టిని తన వైపు తిప్పుకునేలా జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పలువురు జాతీయ నేతలు హాజరవుతున్నారు. ఢిల్లీ,పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు..కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, పినరయి విజయన్ సహా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు పలువురు జాతీయ నేతలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న రాత్రే హైదరాబాద్ కు విచ్చేసిన వీరంతా.. ఉదయం ప్రగతిభవన్ కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన అల్పాహార విందులో విశిష్ట అతిథులు పాల్గొన్నారు. విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై ఈ నేతలు చర్చించారు. విందు అనంతరం బేగంపేట్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ లలో ముఖ్యమంత్రులు, ఇతర నేతలు యాదాద్రికి వెళ్లారు.
యాదాద్రి పర్యటన అనంతరం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,జాతీయ నేతలు హెలికాప్టర్ లలో ఖమ్మం బయలు దేరి వెళ్లారు. అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం, కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం కలెక్టరేట్ లోనే భోజనం చేయనున్నారు. అతిథుల భోజనం కోసం భారీ మెనూ సిద్ధం చేశారు. 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు.