కేసీఆర్ సర్కార్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందన్నారు. ఈ తొమ్మిది ఏళ్ళలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో కోరం క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన పొంగులేటి.. కేసీఆర్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనేక మంది బలిదానాల తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పొంగులేటి చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన హమీలు మాటలకే పరిమితమయ్యాయి కానీ అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. గారడి మాటలు చెప్పే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గర పడిందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్న పొంగులేటి..ప్రజాభీష్టం మేరకు తన రాజకీయ ప్రస్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు.
డబుల్ బెడ్ రూమ్..దళిత బంధు స్కీమ్ అడ్రస్ లేకుండా పోయిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడిందన్న ఆయన.. నాలుగు సంవత్సరాల నుండి పదవి ఉన్నా.. లేకున్నా.. ప్రజలతోనే ఉన్నానని చెప్పారు. ప్రజలే తనకు దేవుళ్లని పొంగులేటి అన్నారు.