కేసీఆర్ ను బీఆర్ఎస్ నేత పార్థసారథి పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ ఎప్పుడూ ఏపీ ప్రజలను దూషించలేదని.. కేవలం ఆంధ్రా పాలకులు, పెట్టుబడిదారుల దోపిడీనే ప్రశ్నించారని ఆయన కితాబిచ్చారు. బీజేపీయే ఆంధ్రాకు అన్యాయం చేసిందని ఆపార్టీపై ఆయన విరుచుకుపడ్డారు.
అమరావతిలో ప్రెస్ మీట్ లో మాట్లాడిన బీఆర్ఎస్ లీడర్ పార్థసారథి..కేసీఆర్ ఎప్పుడైనా ఆంధ్రా పాలకులు, పెట్టుబడి దారుల దోపిటీనే ప్రశ్నించారు కానీ, ప్రజలను ఆయన ఎప్పుడూ ఒక్క మాట అనలేదని స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో ఉన్న ఏపీ ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని విమర్శించారు.
కేసీఆర్ జాతీయ పార్టీ నేతగా ఏపీ హక్కుల కోసం పోరాటం చేస్తారని తెలిపారు. ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభ దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతం అవుతుందని ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్వవస్థను పూర్తిగా నాశనం చేసిందన్న ఆయన.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఫలాలను దేశం మొత్తం అమలు చేయాలని కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చారని చెప్పుకొచ్చారు.
ఇక రైతే రాజు అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళుతుందని.. దళిత బంధు పథకాన్ని దేశం అంతా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్థిని ఏపీ ప్రజలు కూడా కోరుకుంటున్నారని.. చంద్రబాబు,వైఎస్ జగన్ రాష్ట్ర అభివృద్దిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్, చంద్రబాబుకు ప్రధాని మోడీ అంటే భయం.. అందుకే ప్రశ్నించడం మానేశారని పార్థసారథి విమర్శించారు.
కేసీఆర్ సారథ్యంలో ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ ఉంటుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేస్తే అడగలేక పోయారు అని ఏపీ నేతలపై మండిపడ్డారు. కానీ కేసీఆర, కేటీఆర్ విశాఖ కార్మికులకు అండగా నిలిచారన్నారు.