కేంద్ర ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై అసహనం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని స్పష్టం చేశారు.
బడ్జెట్ దశ, దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేనిదని విమర్శించారు కేసీఆర్. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడుకుందని ఆరోపించారు. కేంద్రం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశకు గురి చేసిందని చెప్పారు. ఇది మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ అని అభివర్ణించారు.
వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు సీఎం. దేశ రైతాంగానికి బడ్జెట్ లో ఏం కేటాయించారని ప్రశ్నించారు. అలాగే చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఉద్యోగులను, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు.
ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు ఎంతో ఎదురు చూశారని వారి ఆశల మీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు కేసీఆర్. వైద్యం తదితర ప్రజారోగ్యం, మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేట తెల్లమైందని విమర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తుంటే.. ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని అన్నారు కేసీఆర్. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం, మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్న ఆయన.. ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.