ఎమ్మెల్సీ కవిత శనివారం ఈడీ విచారణ ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంపై ఎందుకు స్పందించరని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ కవితకు ఈడీ నోటీసులపై రియాక్ట్ అయ్యారు. ఎంత మంచి పనిచేసినా బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. కవితను అరెస్ట్ చేయొచ్చని వ్యాఖ్యానించారు. దేనికీ తగ్గేది లేదని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ లేకుండా చేద్దామన్నారు.
గతంలో మంత్రి గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్రలను ఇబ్బంది పెట్టి.. ఇప్పుడు కవితను టార్గెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్. అయినా, ఏమాత్రం వెనకడుగు వేయొద్దని ప్రజల కోసం కడుపు కట్టుకొని పనిచేయాలని తెలిపారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.
ఇక.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై వస్తున్న వార్తలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ లో ఎన్నికలు ఉంటాయని తెలిపారు. పార్టీ నేతలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని వారికి సూచనలు చేశారు.
పాదయాత్రలు, కార్నర్ మీటింగ్స్ లాంటివి నిర్వహించాలని పేర్కొన్నారు కేసీఆర్. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించి పెండిగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం నిర్వహించేవాళ్లమని.. కానీ టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చినందున ఇక నుంచి ఆ సమావేశం ఉండదని తెలిపారు. దానికి బదులు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తామన్నారు. అదే రోజు వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించిన కేసీఆర్.. ఆరోపణలను స్ట్రాంగ్ గా తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు.