జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసిన తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఏపీలోనూ పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు. అయితే సీఎం,కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.
ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు.. అని ప్రశ్నించారు జీవీఎల్. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ఆంధ్రాపార్టీలు,నాయకత్వం వద్దన్న కేసీఆర్ కు ఇక్కడ పనేంటీ? అని నిలదీశారు. ఇక తెలంగాణలోనూ బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహం ప్రజలు మర్చిపోరన్న ఆయన… అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులు వేశారని తెలిపారు.. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను సముద్రం పాలు చేసిన కేసీఆర్ చర్యలతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కానీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రాకు వస్తారని కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ మండిపడ్డారు.
ఇక ఆంధ్రాకు కేసీఆర్ రాకను నిరసిస్తూ..కేఎపాల్ కేసీఆర్ ను ఏపీ ప్రజలు చెప్పులతో కొడతారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకలాపాలు మహారాష్ట్ర ,కర్ణాటక నుంచే మొదలవుతాయని అప్పట్లో ప్రకటించిన కేసీఆర్ దానికి విరుద్ధంగా ఏపీ నుంచే ఈ ప్రక్రియను మొదలు పెట్టారు. బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్టు కేసీఆర్ తెలంగాణ భవన్ లో ఏపీ నేతల చేరికల వేదికపై నుంచే ప్రకటించారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తామన్నారు కేసీఆర్.