కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో టీ కాంగ్రెస్ సీనియర్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు నమోదైన ఎఫ్ఐఆర్ 455 తో పాటు ఇప్పుడు టికాంగ్రెస్ ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ ఫిరాయించి రాజకీయంగా లబ్ది పొందిన 12 మంది ఎమ్మెల్యేల పై కూడా విచారణ చేపట్టాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తీరు పై మండిపడ్డారు. కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే.. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాల్సిన అవసరం చాలా ఉందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
పార్టీ ఫిరాయింపులతో తన అధికారాన్ని కేసీఆర్ పదిలం చేసుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. అందుకే కేసీఆర్ 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఆ పార్టికి ఇచ్చారు. అయినా కాని కేసీఆర్ ఆలోచనా ధోరణి మార రాలేదన్నారు రేవంత్ రెడ్డి.
రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించడం ఆయన రాజకీయ దాహానికి నిదర్శనమని చెప్పారు రేవంత్ రెడ్డి. ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారని.. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ప్రోత్సహించారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా.. స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదన్నారు ఆయన.
ఇక పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని..ఈ కేసులో కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయన్న ఆయన..రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫిర్యాదు చేయడానికి వస్తే..పోలీస్ స్టేషన్ లో ఉన్నతాధికారులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇక పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా వివరాలతో ఫిర్యాదు చేస్తామని..విచారణ వ్యవస్థలు సరిగ్గా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.