ఉత్తరాఖండ్ లో కొనసాగుతున్న చార్ ధామ్ యాత్రలో భక్తుల రద్దీ నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల తర్వాత ప్రారంభమైన ఈ యాత్రకు.. దైవ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేదార్నాథ్ క్షేత్రంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో నియంత్రణ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న వ్యక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హెలికాప్టర్ ల్యాండింగ్ కు సంబంధించిన ఈ వీడియో మే 31 నాటిదిగా తెలిసింది. ప్రైవేట్ ఎయిర్లైన్ హెలికాప్టర్ కేదార్నాథ్ హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతున్నప్పుడు అకస్మాత్తుగా దాని నియంత్రణను కోల్పోయింది. కానీ, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు. దీంతో ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న వీడియోలో.. ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్ మెల్లగా ఎలా వంగి ఉందో స్పష్టంగా కనిపిస్తుంది. ల్యాండింగ్ చేస్తున్నప్పుడు పైలట్ హెలికాప్టర్ పై నియంత్రణ కోల్పోవడం, హెలికాప్టర్ గాలి నుండి భూమికి కదులుతున్నట్లు కనిపిస్తుంది. అయితే.. కొన్ని సెకన్ల తర్వాత పైలట్ పరిస్థితిని గ్రహించి సురక్షితంగా ల్యాండ్ చేయడం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది.
ఈ వీడియో బయటపడిన తర్వాత.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. అదే సమయంలో ఈ విషయాన్ని ఆ శాఖ సీరియస్ గా తీసుకుంది. ప్రైవేట్ హెలికాప్టర్ ఆపరేటర్లకు జారీ చేసిన ఉమ్మడి ఎస్ఓపీ భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కోరినట్లు డీజీసీఏ తన ప్రకటనలో తెలిపింది. వారి కార్యకలాపాలపై భద్రతను దృష్టిలో ఉంచుకుని స్పాట్ చెక్ కూడా ప్లాన్ చేయాలని నిర్ణయించింది డీజీసీఏ.