బ్యూరో క్రాట్ల నియంత్రణ అంశంపై విపక్షాల మద్దతు కూడగడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలంగాణ బాట పట్టారు. ఈక్రమంలో ఆయన సీఎం కేసీఆర్ తో రేపు భేటీ కాబోతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, నితీష్ కుమార్, తేజస్వీలతో పాటు మరికొంత మంది నేతలతో కేజ్రీవాల్ సమావేశమయ్యారు.
అదే సమయంలో ఆయన కలుస్తున్న వారందరీతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపుస్తున్నారు.అయితే గత కొంత కాలంగా కేసీఆర్, కేజ్రీవాల్ కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు కేజ్రీవాల్ ఆసక్తి చూపుతున్నారు.
మరోవైపు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆమ్ ఆద్మీ నిర్ణయం తీసుకోగా ఈ విషయంలో బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ తో కేజ్రీవాల్ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కల్గిస్తోంది.
మరో వైపు కాంగ్రెస్ కు చాలా దూరంగా ఉండే కేజ్రీవాల్ ఆ పార్టీ నేతలను సైతం కలిసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఉమ్మడి పోరాటంలో భాగంగా రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం అయ్యేందుకు సమయం కావాలని కోరినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.