కేరళ పాలపక్కడ్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 9 మంది మరణించారు. సుమారు 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాలక్కడ్ జిల్లా వడక్కంచేరి వద్ద నిన్న అర్థరాత్రి పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు, కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడం.. ఈ పెను విషాదానికి కారణమైంది.ఎర్నాకుళం జిల్లా మూలంతురుతిలోని ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు.. ఓ టూరిస్ట్ బస్సులో ఊటీకి విహార యాత్రకు వెళ్లారు.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత టూరిస్ట్ బస్సు వడక్కంచేరి వద్ద వేగంగా వెళ్లి.. కేఎస్ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. వెంటనే విద్యార్థులు ఉన్న బస్సు అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న కాల్వలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సు 49 మంది ప్రయాణికులతో కొట్టరక్కర నుంచి కోయంబత్తూర్ వెళ్తోంది.
ఆర్టీసీ బస్సులోని ప్రయాణికుల్లో ఒకరు మరణించారు. టూరిస్ట్ బస్సులోని ఓ టీచర్ మరణించగా.. మిగిలిన మృతులంతా విద్యార్థులని తెలిసింది. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు.