కేరళలోని నరబలి కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాతనంతిట్ట జిల్లా ఎలంతూర్లో జరిగిన దారుణమైన నరబలి కేసు దర్యాప్తులో భాగంగా అక్టోబర్ 11న వెలికి తీసిన ఇద్దరు మహిళల మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయిందని కొట్టయం మెడికల్ కాలేజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
బాధితుల్లో ఒకరైన రోస్లిన్ అస్థిపంజరం మాత్రమే లభ్యమవగా, రెండో బాధితురాలు పద్మ మృతదేహం 56 ముక్కలుగా లభ్యమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. “రోస్లిన్ పోస్ట్మార్టం మొన్నపూర్తయింది. నిన్న పద్మ మృతదేహంపై పోస్టుమార్టం పూర్తయింది. అవి మహిళల మృతదేహాలు అని నిర్ధారించి పోస్ట్మార్టం నిర్వహించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వైద్య విచారణలో జాప్యం జరిగిందనిష అధికారులు పేర్కొన్నారు.
ఆదూర్ ఆర్డీవో పోస్టుమార్టం అనంతరం విధివిధానాలు పూర్తి చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు. అయితే డీఎన్ఏ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు.
క్షతగాత్రుల స్వభావం, మృతుల అంతర్గత అవయవాలకు సంబంధించిన వివరాలతో సహా పోస్టుమార్టం నివేదికను త్వరలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కోర్టులో దాఖలు చేసిన పోలీసు రిమాండ్ రిపోర్టు ప్రకారం.. బాధితుల్లో ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసినట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ షఫీ (52), భగవల్ సింగ్ (68), అతని భార్య, మసాజ్ థెరపిస్ట్ లైలా (59)లకు కోర్టు గురువారం 12 రోజుల కస్టడీకి అప్పగించింది.
పతనంతిట్టలోని ఎలంతూరు గ్రామంలోని దంపతుల ఇంటి ఆవరణలో మృతుల శరీర భాగాలను వెలికితీశారు. కేరళ నరబలి కేసులో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. బాధితులు మరింత ఎక్కువ మంది ఉండే అవకాశముందనే దానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వివాహేతర సంబంధ కోణం దాగివుందనేదానిపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాంత్రికుడు మహ్మద్ షఫీ తర్వాత టార్గెట్ లైలా భర్త భగవల్ సింగ్ అయ్యుంటాడనీ, ఆమెతో కలిసి జీవించేందుకు స్కెచ్ వేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.