– కీలక అంశాలు వెల్లడించిన సునీతారెడ్డి
– తన తండ్రిని చంపిందెవరో అందరికీ తెలుసంటున్న సునీత
– సునీత అందించిన వాగ్మూలంలో పలువురి పేర్లు
– ఏపీ సీఎం జగన్ పేరు ఉన్నట్టు సమాచారం
– జగన్ కు ఉచ్చు బిగుసుకోనుందా..?
– చివరి దశకు చేరిన సీబీఐ విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే వివేకా హత్య కేసులో హంతకులెవరో గుర్తించిన సీబీఐ.. ఇక వారిని దోషులుగా నిరూపించేందుకు పూర్తిస్దాయి అధారాల వేటలో పడింది. ఈ క్రమంలో గతంలో సీబీఐకి నిందితుల గురించి సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో వెలుగు చూసిన అంశాలు కలకలం రేపుతున్నాయి. తన తండ్రి హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై సీబీఐకి గత ఏడాది ఆమె ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగు చూసింది. వివేకా హత్య అనంతర పరిణామాలు, హత్యపై ఎవరెలా స్పందించారు.. ఎవరెవరి హస్తం ఉండొచ్చనే విషయాలపై సునీతారెడ్డి సీబీఐకి కీలక అంశాలను అందించారు. దీంతో సునీతారెడ్డి చెప్పిన అంశాలు కీలకంగా మారేలా ఉన్నాయంటున్నారు సీబీఐ అధికారులు. అన్నింటికీ మించి సీఎం జగన్ పేరును కూడా ఇందులో ఆమె ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
తన తండ్రిని ఎవరు చంపారో అందరికీ తెలుసని ఆమె అన్నారు. నాన్న హత్యపై భారతి, జగన్ చాలా తేలిగ్గా తీసుకున్నారని.. ఈ హత్య విషయంలో జగనన్న వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. హత్య గురించి అనుమానితుల పేర్లను జగనన్నకు చెబితే ‘వాళ్లను ఎందుకు అనుమానిస్తున్నావు.. నీ భర్తే హత్య చేయించాడేమో’ అని అన్యాయంగా మాట్లాడారని వెల్లడించారు.
కేసు సీబీఐకి అప్పగిస్తే అవినాష్ కు ఏమీకాదు.. బీజేపీలో చేరతాడు. ఇప్పటికే మాపై 11 కేసులున్నాయి.. మీది 12వది అవుతుందని అన్నారని’ ఆమె వివరించారు. సీబీఐ విచారణ కోసం తాను కోర్టుకు వెళ్తే జగన్ రాజకీయ భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని వైవీ సుబ్బారెడ్డి.. సజ్జల అన్నారని సునీతా రెడ్డి గుర్తు చేశారు. అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల డైరెక్షన్ లో హత్య సమయంలో ఆధారాలను మాయం చేశారని ఆమె పేర్కొన్నారు.
అవినాశ్రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలతో పాటు మరికొందరు అనుమానితులను విచారిస్తే నిజాలు బయటపడతాయని తన వాంగ్మూలంలో వివరించారు. నా తండ్రి వివేకా అంటే ఎంపీ అవినాశ్ కు గిట్టదని, హంతకులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. గత్యంతరం లేక సీబీఐని ఆశ్రయించానని ఆమె వెల్లడించారు.