దేశ రాజధాని ఢిల్లీలో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్ పురి, జనక్ పురి, పశ్చిమ విహారీ,పిరాగర్హి తదితర ప్రాంతాల్లో ఖలిస్థాన్ ఏర్పాటుకు అనుకూలంగా గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు.
సిక్కులకు న్యాయం చేయాలి, ఖలిస్థానీ జిందాబాద్, రెఫరెండం 2020 అనే నినాదాలను ఆ పోస్టర్లపై రాశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధానిలో వేర్పాటువాద పోస్టర్లు, జెండాలు కన్పించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్తవ్యపథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ కోసం కంటెంజెంట్లు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ నెల 23 న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6.30 నుంచి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కర్తవ్యపథ్ ను మూసివేయనున్నారు.