ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఉన్నత చదువులకు కోసం వెళ్లిన భారతీయ పౌరులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలను కూడా రంగంలోకి దింపింది.
ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మాట్లాడారు. భారత విద్యార్థులను రష్యా మీదుగా తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని.. భారతీయులు సురక్షితంగా బయటకొచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరారు.
దీంతో.. ఖార్కివ్ నుంచి భారతీయులు వెళ్లేందుకు 6 గంటల పాటు వెసులుబాటు కల్పించింది రష్యా ప్రభుత్వం. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.30 గంటల వరకు ఉంటుంది.
ఖార్కివ్ ను వదిలి వెళ్లాలంటూ భారతీయులకు ఇండియన్ ఎంబసీ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోతే కాలినడకన రావాలని.. పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు వెంటనే వెళ్లాలని సూచించింది. మరో 4 గంటల్లో ఖార్కివ్ ను ఖాళీ చేయాలని ఆదేశాల్లో పేర్కొంది ఇండియన్ ఎంబసీ.
రష్యా పెట్టిన డెడ్లైన్ తర్వాత ఖార్కివ్ ను స్వాధీనం చేసుకునే పనిలో రష్యా సేనలు మరింత ముందుకు కదలనున్నట్టు తెలుస్తోంది. తాము ఇచ్చిన ఆరు గంటల సేఫ్ ప్యాసేజిని వినియోగించుకోవాలని రష్యా సూచిచింది. దీంతో.. విద్యార్థులను అప్రమత్తం చేస్తూ ముందుకు కదిలేలా చేస్తోంది ఇండియన్ ఎంబసీ.