ఖైరతాబాద్ ప్రేమ్ నగర్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ థర్డ్ ఫ్లోర్కు ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బస్తీ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. మంచి నీటి కొరత, మురుగు నీటి ఇబ్బందులు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ప్రచారాలకు డబ్బు ఖర్చు చేస్తున్న బీహెచ్ఎంసీ అధికారులు.. అభివృద్ధి పనులకు మాత్రం నిధులు లేవని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లను చూపించి ఇదే అభివృద్ధి అంటోందని దుయ్యబట్టారు.
హైఫై రోడ్ల వల్ల ప్రజలకు ఒరిగేదేమీలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. సర్కారుకు 80 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నా అందులో 5 శాతం కూడా నగర ప్రజల కోసం ఖర్చు చేయడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ. 85వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెబుతున్నారని, ఆ నిధులతో ఏ పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలనీలు, బస్తీల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే తాను పాల్గొంటున్న కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి గైర్హాజరవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారులను ఫోన్లో నిలదీశారు.