తెలంగాణలో సీఎం కేసీఆర్ లేని సమస్యను సృష్టించారని విమర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బాయిల్డ్ రైసు ఇవ్వబోమని కేంద్రానికి కేసీఆర్ రాతపూర్వకంగా తెలిపారా..? లేదా..? ఆత్మ సాక్షిగా చెప్పాలన్నారు. బాయిల్డ్ రైసును ఏ రాష్ట్రంలోనూ వినియోగించటం లేదని.. ఉచితంగా పంచినా ప్రజలు తినే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
గత సీజన్ లో ఎఫ్సీఐకి 62 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారమే ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్ రైసును ఎఫ్సీఐకి పంపలేదని ఆరోపించారు. పాతది పక్కకు పెట్టి కొత్తదాని కోసం కేసీఆర్ కొట్లాడటం సిగ్గు చేటుగా ఉందన్నారు కిషన్ రెడ్డి.
ఒకటి రెండు కాదు.. అనేక విషయాల్లో సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యాన్ని ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. బాయిల్డ్ రైసు కాకుండా ముడి బియ్యం సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
వడ్లు సేకరించి రా రైస్గా ఇస్తే కేంద్రానికి ఏం అభ్యంతరం లేదన్నారు. కేంద్రానికి రా రైసు సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత మేర నష్టం రావొచ్చని.. రైతుల కోసం ఆ మాత్రం నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా..? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం కిలో రూ.33 చొప్పున బియ్యం సేకరించి మళ్లీ ప్రజలకు రూ.3 కే ఇస్తోందని వివరించారు కిషన్ రెడ్డి.