ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి వెంట విశాఖ రాజధాని అనే ప్రస్తావన వచ్చింది. వివరాలు.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023కు హాజరయ్యేందుకు కిషన్ రెడ్డి విశాఖపట్నం వచ్చారు. అయితే విశాఖలో బీజేపీ సంబంధింత కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి.. ఉత్తరాంధ్ర పట్టభద్రలు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ను మరోసారి గెలిపించాలని కోరారు.
మాధవ్ను గెలిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. విశాఖపట్నం అభివృద్ది చెందుతున్న నగరం అని.. అనేక కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. విశాఖపట్నం రాజధాని, జిల్లా కేంద్రంలో మాధవ్ లాంటి వ్యక్తి ఉన్నట్టయితే ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో రాజకీయాలు దిగజారుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. కక్ష సాధింపు చర్యలతో అభివృద్ది కుంటుపడుతోందని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు.
కుటుంబ పార్టీల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి కేంద్రం భారీగా నిధులు వెచ్చిస్తుందని చెప్పారు. బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని అన్నారు.