జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి కార్మికులతో సమావేశం అయ్యారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. కార్మికులకు ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. సింగరేణి కార్మికుల కోసం 4 ఆస్పత్రులను కట్టిస్తామని 2016లో కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు దానిపై అతీగతి లేదని విమర్శించారు. ఎనిమిదేళ్ల పాలనలో సింగరేణి పరిరక్షణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రశ్నించారు కేంద్రమంత్రి.
సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. బొగ్గుగనులకు సంబంధించిన దరఖాస్తును రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే సింగరేణికి వాటిని కేటాయించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రానికి దరఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కోల్ బ్లాకుల విషయంలో కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూపీఏ హాయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బొగ్గు గనులను ప్రైవేట్పరం చేశారని ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల ప్రభుత్వం కనిపించకుండా పోతుందని కిషన్ రెడ్డి సంచలన వ్యఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించిన వారంతా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారని.. ఉద్యమంలో పోరాడిన వారందరూ కనుమరుగయ్యారని విమర్శించారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాలను సీఎం విస్మరించారని ఆరోపించారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎంను చేస్తానన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లోనైనా మాట నిలబెట్టుకుంటాడా..? లేదా..? నిలదీశారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో వస్తే.. సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ తీసుకొస్తామన్న కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. సింగరేణి కార్మికులు చెల్లించే ఆదాయ పన్నును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లించేలా చర్యలు చేపడుతామని అన్నారు కిషన్ రెడ్డి.