– బండి సంజయ్ యాత్రకు మద్దతివ్వండి
– బీజేపీ అధికారంలోకి వస్తే నీతివంతమైన ప్రజాస్వామిక పాలన అందిస్తాం
– వ్యవసాయానికి కరెంట్ మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు
– కేసీఆర్ ది అంతా దుష్ర్పచారం
– క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనపట్ల విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన పోవడం.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అవినీతి-నియంత-కుటుంబ పాలనను ఎండగడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని వారి పరిష్కారం కోసం పోరాడేందుకే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తున్న బండి సంజయ్ కు మద్దతు పలకాలని కోరారు. గద్వాల్ జిల్లాలో రెండోరోజు పాదయాత్రలో భాగంగా లింగన్ వాయి గ్రామంలో ‘ప్రజల గోస-బీజేపీ భరోసా’ పేరిట నిర్వహించిన రచ్చబండలో కిషన్ రెడ్డి మాట్లాడారు.
కరోనా కాలంలో ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వమని… గ్రామాల్లోని పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ ను ఉచితంగా అందించడంతో పాటు ఔషధాలు ఇస్తోందని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి అనుకున్న సమయానికే నిధులు అందుతున్నాయని వివరించారు. ప్రతి ఏడాది గ్రామంలో రోడ్లకు, వీధిలైట్లు, పారిశుద్ధ్యం కోసం కేంద్రం నిధులు ఇస్తోందని చెప్పారు.
‘‘పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఇంట్లో మహిళలకు పొగబారిన బతుకుల నుంచి విముక్తి కోసం గ్యాస్ కనెక్షన్లు అందిస్తోంది. సంవత్సరానికి రూ.5లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొస్తే.. కేసీఆర్ సర్కార్ మోకాలడ్డుతోంది. రైతుల కోసం సమగ్రమైన పంట బీమా పథకం తీసుకొస్తే దాన్నీ అడ్డుకుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇండ్లు మంజూరు చేస్తే కేసీఆర్ మాత్రం పేదలకు అందకుండా చేస్తున్నారు’’ అని ఆరోపించారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనలో పావలా వడ్డీ రుణాలు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కౌలు రైతులకు రైతుబంధు రావడం లేదు.. వారికి నరేంద్ర మోడీ ప్రభుత్వం డబ్బులిస్తున్నా కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు ప్రగతి భవన్ దాటడం లేదని… పెండింగ్ పనులు ముందుకు సాగాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు. కుటుంబ, నిజాం నియంతృత్వ పాలన పోయి.. ప్రజాస్వామ్య భారతీయ జనతా పార్టీ పాలన రావాలని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా సశ్యశ్యామలం కావాలంటే బీజేపీ రావాల్సిందేనన్నారు.
‘‘బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు అందరు కలిసి రండి… తెలంగాణలో అవినీతి రహిత పాలనను అందిపుచ్చుకోవాలి. కేసీఆర్ నియంతృత్వ, అచారక, కుటుంబ పాలన పోవడం ఖాయం. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తాం. కేసీఆర్ ఎంత విష ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే. చాలా మంది నియంతలను చూశాం. కేసీఆర్.. ఏదీ శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఇష్టారాజ్య పాలన జరుగుతోంది. లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియాతో దోచుకుంటున్నరు. ప్రస్తుతం కేసీఆర్ పీఠాలు కదులుతున్నాయ్.. అందుకే బయటకొచ్చి తిరుగుతున్నడు. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని చెబుతుండు.. కేసీఆర్.. 2024లో ఈ దేశానికి ప్రధాని అయ్యేది మళ్లీ నరేంద్రమోడీ మాత్రమే. నువ్వు ఎంత మొత్తుకున్నా నీ ఆశలు నెరవేరవు’’ అంటూ సెటైర్లు వేశారు కిషన్ రెడ్డి.