కరోనా నాలుగో దశ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లిలో జిల్లాలో పర్యటించిన మంత్రి.. రేగొండ మండలం ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.
నాలుగో విడత కరోనాను నియంత్రించేందుకు ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని సూచించారు. ఇంకా టీకాలు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని కోరారు. ఐదు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పిల్లలకూ త్వరలోనే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు కిషన్ రెడ్డి.
దేశంలో విద్య, వైద్యం, ఉపాధి పరంగా ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించిన చోట్ల మరింత వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగా దేశంలో అన్ని చోట్ల కేంద్రమంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, అసిఫాబాద్ జిల్లాలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రేగొండ పీహెచ్సీలో ప్రజలకు వైద్యసేవలు కార్పొరేట్ ఆసుపత్రిలో అందినట్టుగా అందుతున్నాయంటూ ప్రశంసించారు. అంతకుముందు రూపిరెడ్డిపల్లిలో రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు కిషన్రెడ్డి.