గుంటూరు: టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య గురించి మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల ఆత్మహత్య దురదృష్టకరమన్నారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. కోడెలకు ఇబ్బందులెదురైతే చంద్రబాబు పట్టించుకోలేదని నాని ఆరోపించారు. ‘వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబుకు కోడెల సహకరించారు. చంద్రబాబుకు ఇంత చేసినా తనను పట్టించుకోలేదని కోడెల మనస్తాపం చెందారు. ఆలపాటి రాజాకు మంత్రి పదవి ఇచ్చి కోడెలను చంద్రబాబు పక్కనపెట్టారు. కోడెలకు నర్సరావుపేట సీటు ఇవ్వకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేయించారు. కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ను చేశారు. అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకెళ్లి వాడుకున్నట్టు స్వయంగా కోడెల ప్రకటించారు..’ అని ఈ సందర్భంగా చంద్రబాబుపై నాని విమర్శలు చేశారు.