ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. కీలకమైన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ చేతులెత్తేయగా, కోల్ కతా అదరగొట్టింది. ఆల్ రౌండ్ షో తో హైదరాబాద్ పై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ లో చెలరేగిన ఆండ్రూ రస్సెల్, బౌలింగ్ లోనూ విజృంభించాడు. కోల్ కతా విజయంలో కీ రోల్ ప్లే పోషించాడు.
కోల్ కతా నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్.. 123 పరుగులకే పరిమితమైంది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 123 పరుగుల మాత్రమే చేసింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ.. 28 బంతుల్లో 43 పరుగులు చేసాడు. ఎయిడెన్ మార్ క్రమ్ 25 బంతుల్లో 35 పరుగులు చేశాడు.
వీరిద్దరూ మినహాయిస్తే మిగతా మిగతా బ్యాటర్లు ఎవరూ అనుకున్న స్థాయిలో రాణించలేదు. కీలకమైన మ్యాచ్లో హైదరాబాద్ టాప్ ఆర్డర్లోని బ్యాటర్లు టెస్టు ఆటను తలపించారు. కోల్ కతా బౌలర్లలో ఆండ్రూ రస్సెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. టిమ్ సౌథీ రెండు వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసుకొని అంద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు.
హైదరాబాద్ కు ఇది వరుసగా ఐదో ఓటమి. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. హైదరాబాద్పై ఘన విజయం సాధించిన కోల్కతా టెక్నికల్ గా ఛాన్స్లను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం 12 మ్యాచుల్లో హైదరాబాద్ ఐదు విజయాలతో 10 పాయింట్లను మాత్రమే సాధించింది. ఇక కోల్కతా 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఆరో స్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారింది.