ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి కృష్ణ నీటిని వాడుకుందని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ అన్నారు. నీటి లెక్కల విషయంలో కృష్ణ నదీ యాజమాన్య బోర్డు కఠినంగా ఉండాలని ఆయన అన్నారు. హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ లెక్కల ద్వారా రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత వాడుకున్నదనే విషయం తెలుస్తుందన్నారు. ఇంకా ఎవరి వాటా ఎంత మేర మిగిలి ఉందో తేలిపోతుందని చెప్పారు.
ఈ రోజు నిర్వహించే సమావేశానికి తాను హాజరు కాలేనని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ముందుగానే సమాచారం ఇచ్చారు. తాను పోలవరం పర్యటనలో ఉన్నానని, అందుకే సమావేశానికి హాజరు కాలేనని ఆయన బోర్డు సభ్య కార్యదర్శికి లేఖ రాశారు.
ఈ క్రమంలో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సమావేశమయ్యారు. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి కృష్ణా నీటిని వాడుకుందన్నారు. తమకు ఇంకా 141టీఎంసీలకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఆ మేరకు నీటిని వాడుకుంటామని ఆయన చెప్పారు.
వచ్చే నెల మొదటి వారంలో మరోమారు త్రిసభ్య కమిటీ సమావేశం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని బోర్డును తెలంగాణ కోరింది. కొత్త ఛైర్మన్ వచ్చిన నేపథ్యంలో బోర్డు సమావేశం పెట్టాలని మురళీధర్ అన్నారు.