రాష్ట్రంలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ రోజు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శాసన సభలో చర్చ సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్ అబద్దాలను కూడా వినసొంపుగా చెప్పారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లల్లో రైతులను మోసం చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తరుగు పేరుతో క్వింటాల్ కు 8 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే అంశంపై శాసన సభలో చర్చ సందర్భంగా ఆయన రైతు సమస్యలను ప్రస్తావించారు.
తెలంగాణలో ఈ ఏడాది 107 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు..కానీ ఆ కొనుగోలు కేంద్రాల్లో రైతులను మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 లక్షల మంది నిరుద్యోగులందరికి ఎప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తారో తెలపాలన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. వైద్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని… ప్రతి జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు..ఆ మాట ఏమైందని ఆయన నిలదీశారు. 108 అంబులెన్స్ ల సేవలను కూడా కేసీఆర్ సర్కార్ పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు.