ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సుమారు 8 గంటల పాటు విచారించిన సీబీఐ అనంతరం అరెస్ట్ చేసింది. ఇక సోమవారం మనీష్ సిసోడియాను అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. ఆయనను కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరనుంది.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీగా స్కాం జరిగిందని..నిబంధనలకు విరుద్దంగా టెండర్లు కట్టబెట్టారని సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనను విచారించి అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే 11 మందిని సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసింది. సిసోడియా అరెస్ట్ ను పలువురు రాజకీయ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ సిసోడియా అరెస్ట్ పై స్పందించారు.
మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికం. ఆయన అరెస్టును బీఆర్ఎస్ ఖండిస్తుందని అన్నారు. ప్రతిపక్షాలపై బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని..కేంద్రం ఆధీనంలోని ఏజెన్సీలను ప్రతిపక్షాలపై ఉసిగొలిపి బీజేపీ దొంగచాటు రాజకీయాలను చేస్తుందని అన్నారు. ప్రజాబలం లేని అధికారం రాలేని ప్రాంతాల్లో కేంద్రం ఏజెన్సీలను అడ్డుపెట్టుకొని బలహీనపరిచే కుట్రలో భాగంగానే సిసోడియా అరెస్ట్ జరిగిందని అన్నారు.
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో సుప్రీంకోర్టులో చివాట్లు తిన్న తర్వాత ఎదురైన పరాజయాన్ని తట్టుకోలేకే ఇప్పుడు సిసోడియాను అరెస్ట్ చేశారన్నారు. బీజేపీ అసమర్ధ పాలనను..అవినీతిని ప్రశ్నిస్తున్న పార్టీలను ఎదుర్కోలేక పిరికి రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
ఇప్పటికే దేశంలో 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీ అని ఆరోపణలు చేశారు. తెలంగాణలోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ కుట్ర చేసి భంగపడింది. బీజేపీ కుటిల ప్రయత్నాలను కెమెరాల సాక్షిగా ప్రజలు గమనించారన్నారు. బీజేపీ దుర్మార్గాలకు కాలం దగ్గర పడిందని కేటీఆర్ అన్నారు.