ఇంకో ఐదేళ్లు కరువు వచ్చినా హైదరాబాద్ లో తాగునీటికి కరువు ఉండదన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద సుంకిశాల ఇంటెక్వెల్ ప్రాజెక్టుకు.. మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి కేటీఆర్ భూమి పూజ చేశారు. హైదరాబాద్ నగరం ఎంత విస్తరించినా రాబోయే 50 ఏళ్లకు సరిపడా నీటి కోరతను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు కేటీఆర్.
హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 37 టీఎంసీల నీరు అవసరమని కేటీఆర్ అన్నారు. 2072 నాటికి దాదాపు 70.97 టీఎంసీల నీరు అవసరమవుతుందని ఒక అంచనా ఉందని తెలిపారు. కృష్ణా నీటిని అదనంగా తరలించేలా రూ.1459 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ ఫేజ్ 4,5 కి కూడా ఇప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
కొండ పోచమ్మ నుంచి కూడా ఒక లైన్ హైదరాబాద్ కు వేస్తున్నామని.. వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్నామని వివరించారు. కోట్ల మందిని దృష్టిలో పెట్టుకుని సుంకిశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని వెల్లడించారు మంత్రి. ఈ ప్రాజెక్టుకు రూ.1,450 కోట్ల వరకు ఖర్చు అవుతోందని అంచనా వేశారు. కాళేశ్వరం నిర్మాణం దేశానికే గర్వకారణంగా నిలిచిందని పేర్కొన్నారు. వేగంగా నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత కేసీఆర్కు దక్కుతోందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ ప్రజలకు 65 టీఎంసీల నీటిని గోదావరిలో కానుకగా సీఎం అందించారని తెలిపారు. హైదరాబాద్ కు తాగునీటి విషయంలో సీఎం కేసీఆర్ విజన్ పెద్దదన్నారు మంత్రి. ఓఆర్ఆర్ చూట్టూ 159 కిలోమీటర్లు రింగ్ మెయిన్ వేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నీరు రింగ్ మెయిన్లో పడితే తాగునీటికి ఇబ్బంది ఉండదని వ్యాఖ్యానించారు. 2072 వరకు ఇబ్బంది లేకుండా ఉడ్డేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టామని తేల్చిచెప్పారు.