ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఉప్పల్ లో జెన్ పాక్ట్ క్యాంపస్ కి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఐటీ రంగం ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదని తమ ప్రభుత్వం భావించిందన్నారు. అందుకే ఐటీ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. వెస్ట్ హైదరాబాద్ కి దీటుగా ఈస్ట్ హైదరాబాద్ కూడా ఐటీ రంగంలో ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కేవలం మాదాపూర్, హైటెక్ సిటీకే పరిమితమైన ఐటీ కంపెనీలు ప్రస్తుతం నగరం నలుమూలల విస్తరిస్తున్నాయని తెలిపారు కేటీఆర్. ముఖ్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయని అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు సేవలను విస్తరిస్తున్నాయని వివరించారు.
జెన్ పాక్ట్ సంస్థకు అభినందనలు తెలిపిన మంత్రి.. సంస్థ విస్తరణ పూర్తయితే లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తామని అన్నారు. ప్రైవేట్ డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని తెలిపారు. ఈస్ట్ హైదరాబాద్ అభివృద్ధి కోసం నాగోల్ లో శిల్పారామం ఏర్పాటు చేశామని.. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఇక్కడ ఉందని వివరించారు.
ఉప్పల్ నుంచి నారాపల్లి దాకా స్కైవే నిర్మాణం జరుగుతోందన్న కేటీఆర్… జంక్షన్ లో స్కై వాక్ నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్నారు.