ఐటీ రంగంలో 8 ఏళ్లుగా తెలంగాణ అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో 2021-22 ఏడాదికి సంబంధించిన ఐటీ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే.. 9 శాతం ఎక్కువ సాధించామని వివరించారు.
గతేడాది దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్ లోనే లక్షన్నర ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. వన్ ప్లస్ కంపెనీ హైదరాబాద్ లో టీవీలు తయారుచేస్తోందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121కు చేరిందని పేర్కొన్నారు కేటీఆర్.ఈ నెల 20న టీహబ్ రెండో దశ ప్రారంభిస్తామని వెల్లడించారు.
టీ వర్క్స్ కొత్త ఫెసిలిటీ కేంద్రాన్ని ఆగస్టులో ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు.. హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని కేటీఆర్ వివరించారు.
ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడంతో పాటు.. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు కూడా ఉత్తమ గమ్యస్థానం లక్ష్యంతో పనిచేస్తున్నాయని చెప్పారు. ఫేసియల్ రికగ్నైజేషన్ పరిజ్ఞానంతో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గురించి చెబితే.. ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో చాలామంది ఆశ్చర్యపోయారని మంత్రి అన్నారు.