బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఆ విమర్శలు మంత్రి కేటీఆర్ బాగానే హర్టయ్యారు. బండిపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు తన న్యాయవాది చేత నోటీసులు పంపించారు.
ఈమధ్య ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి నిరాధారమైన ఆరోపణలు చేశారని.. వాటికి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని.. సారీ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బండి నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా నోటీసులు పంపించారు కేటీఆర్.
మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతో బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా.. కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని వివరించారు.
కేటీఆర్ పరువుకు భంగం కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసులో పేర్కొన్నారు ఆయన తరఫు న్యాయవాది. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.