హైదరాబాద్: యురేనియం నిక్షేపాల కోసం నల్గొండ జిల్లాలో అన్వేషణ చేపట్టాం కానీ, అమ్రాబాద్ ప్రాంతంలో ఎలాంటి అన్వేషణ చేపట్టలేదని కేటీఆర్ శాసనమండలిలో స్పష్టం చేశారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ చెప్పారు. యురేనియం నిక్షేపాలు ఉన్నా అనుమతులు ఇవ్వబోమని, వన్యప్రాణుల సంరక్షణ విభాగం స్పష్టం చేసిందని మండలిలో కేటీఆర్ పేర్కొన్నారు.
మైనింగ్లో రెండు దశలుంటాయని, తొలి దశలో అన్వేషణ చేస్తారని కేటీఆర్ అన్నారు. ప్రాథమిక దశలో జియాలజిస్టులు అధ్యయనం చేస్తారని, యురేనియం ఉందనే అంచనాకు వచ్చిన తర్వాతే అన్వేషణ, కేంద్రం పరిధిలోని ఏఎండీ ఆధ్వర్యంలో ప్రక్రియ జరుగుతుందని వివరించారు.
మైనింగ్ చేయాలా? వద్దా? అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, యురేనియంపై రాష్ట్రప్రభుత్వం ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. యురేనియం శుద్ధి చేసే వరకు ఎలాంటి రేడియేషన్ వెలువడదన్నారు. అన్వేషణ దశలోనే కృష్ణా జలాలు కలుషితమైనట్టు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.