ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న కేసీఆర్ ను ఇరుకున పెట్టేందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఇరికిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే తప్పు చేసిన వారెవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందే అని బీజేపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. కేటీఆర్…మరకలు తొలగించుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలేవీ పని చేయవన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు కవితను పిలవగానే మహిళా బిల్లు తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.
అలాగే విచారణను అడ్డుకునేందుకు కోర్టులో ప్రయత్నించారని అన్నారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు ప్రజల సానుభూతి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇవేవి పనిచేయవు అంటూ ఆయన ట్వీట్ చేశారు.మరో వైపు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడం సాధారణ విషయమే అని, ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.
పంపకాల్లో తేడాలు రావడంతోనే చిల్లర పంచాయితీలు బయటకు వచ్చాయన్నారు. గతంలో కరోనా బారిన పడి అనారోగ్యంతో బాధపడుతున్న సోనియాగాంధీ మీదకు ఇదే కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించినప్పుడు కవిత, కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.