కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశాన్ని పాలించిన ప్రధానుల్లో అత్యంత అవినీతి పరుడు నరేంద్ర మోడీ అని విమర్శించారు. మోడీ ప్రధాని అయ్యాక 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని మండిపడ్డారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీసిందని ఆరోపించారు కూనంనేని. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా విధ్వంసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా 15 సీట్లు గెలవడమే ఎక్కువని వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి జరుగుతున్నా.. ఒక్క కేసైనా పెట్టారా? అని సాంబశివరావు ప్రశ్నించారు. కవితను కించపరిచే విధంగా మాట్లాడినందుకు బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని కూనంనేని డిమాండ్ చేశారు. షర్మిలపై స్పందించిన గవర్నర్.. కవిత విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఏప్రిల్ 14 నుంచి నెల రోజుల పాటు ‘ఇంటింటికీ సీపీఐ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ‘బీజేపీ హఠావో.. దేశ్ కో బచావో’ అనే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని వివరించారు కూనంనేని సాంబశివరావు.
అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి నేర చరిత్ర ఉన్నవారు ప్రవేశిస్తున్నారని విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మార్చేలా దూరదృష్టితో ఉన్నట్లు కనిపిస్తుందని.. అందుకే ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక అంటున్నారని వ్యాఖ్యనించారు.