దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై సినీ నటి మంచు లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది పనితీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం తిరుపతి నుంచి హైదరాబాద్కు ఇండిగో విమానంలో వచ్చిన లక్ష్మీ ప్రసన్న.. తాను ప్రయాణించిన సమయం కంటే తనకు ఎయిర్పోర్టులో సహాయం చేయడానికి ఇండిగో సిబ్బంది తీసుకున్న సమయమే ఎక్కువంటూ చురకలంటించారు. ఈ మేరకు ఆమె ఇండిగో ఎయిర్లైన్స్ను ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు.
‘మంచిగా ఉంటే పని అవ్వదు. విమానంలో నా పర్స్ మరిచిపోయి దాని కోసం గేటు బయట 40 నిమిషాలు కూర్చున్నాను. మీ సిబ్బందిలో ఎవరైనా నాకు సహాయం చేస్తారా?’ అని ప్రశ్నిస్తూ మొదట మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్లో ఇండిగో ట్విట్టర్ అకౌంట్ను కాకుండా తప్పుగా మరో అకౌంట్ను ట్యాగ్ చేశారు.ఆ తరవాత ఇండిగో ఎయిర్లైన్స్ను కరెక్ట్గా ట్యాగ్ చేస్తూ మంచు లక్ష్మి మరో ట్వీట్ చేశారు.
‘ఇండిగో సిబ్బంది ఎయిర్పోర్టులో నాకు సహాయం చేసిన సమయం కన్నా త్వరగా నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చేశాను. వాళ్లు క్షణాల్లో కనుమరుగైపోయారు. 103 డిగ్రీల జ్వరం కూడా ఎలాంటి సాయం చేయలేదు. ఇండిగో.. దీనికి ఏమైనా ప్రాసెస్ ఉందా?’ అని ట్వీట్లో మంచు లక్ష్మి పేర్కొన్నారు. మంచు లక్ష్మి ట్వీట్కు ఇండిగో సంస్థ స్పందించింది.
‘మేడమ్, హైదరాబాద్ ఎయిర్పోర్టులో మా మేనేజర్తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. విమానంలో మీరు మరిచిపోయిన బ్యాగ్ను తిరిగి పొందడంలో మా సిబ్బంది మీకు సహాయం చేశారని మేం నమ్ముతున్నాం. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. మరోసారి మా విమానంలో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం. మీకు భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా ఎలాంటి అభ్యంతరం లేకుండా మాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి’ అని ఇండిగో వివరణ ఇచ్చింది. అయినప్పటికీ మంచు లక్ష్మి ఆగ్రహం చల్లారలేదు. ‘డియర్ ఇండిగో, బ్యాన్ ఇండిగో’ అని కామెంట్ చేశారు.
అయితే, ఇండిగో ఎయిర్లైన్స్పై సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేయడం ఇది తొలిసారేమీ కాదు. చాలా మంది సెలబ్రిటీలు గతంలో బ్యాగేజ్ విషయంలో ఇండిగో సిబ్బందితో గొడవపడ్డారు. కొన్ని నెలల క్రితం నటుడు రానా దగ్గుబాటి సైతం ఇండిగో సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి భార్యతో కలిసి బెంగళూరు వెళ్లిన రానాను ఇండిగో ఇబ్బంది పెట్టింది. రానా టికెట్లు బుక్ చేసుకున్న ఇండిగో విమానం రద్దయ్యింది. దీంతో మరో విమానంలో రానా ఫ్యామిలీకి సీట్లు కేటాయించారు. అయితే, ఆ విమానంలో రానా లగేజ్ రాలేదు. బెంగళూరు ఎయిర్పోర్టులో ఇండిగో సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ట్విట్టర్ ద్వారా తన ఆగ్రహాన్ని రానా వ్యక్తపరిచారు.